AP : ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం: సీఎం చంద్రబాబు పర్యటనపై కీలక ప్రకటనలు:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్న సందర్భంగా, సింగపూర్ మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి టాన్సీ లెంగ్ ఏపీ ప్రభుత్వంతో వివిధ రంగాలలో కలిసి పనిచేయడానికి తమ సంసిద్ధతను ప్రకటించారు.
సింగపూర్ పర్యటన: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యంపై కీలక ప్రకటనలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్న సందర్భంగా, సింగపూర్ మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి టాన్సీ లెంగ్ ఏపీ ప్రభుత్వంతో వివిధ రంగాలలో కలిసి పనిచేయడానికి తమ సంసిద్ధతను ప్రకటించారు. గత ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సింగపూర్ మంత్రి చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం ఉంటుందని టాన్సీ లెంగ్ స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంపై ఎక్స్ వేదికగా పోస్టు చేస్తూ, ఏపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని టాన్సీ లెంగ్ వెల్లడించారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలు పెట్టుబడులకు అనుకూలమని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఏపీ ఒకటని, ఇక్కడ ఫుడ్ ఎంపైర్, ఎవర్ వోల్ట్ వంటి సింగపూర్ కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు ఎదురుచూస్తున్నాయని తెలిపారు.
అలాగే, పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు, భాగస్వామ్యాలకు ఉన్న అవకాశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు మంత్రి టాన్సీ లెంగ్ స్పష్టం చేశారు. 2014-2019 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి అప్పటి ప్రభుత్వంతో కలిసి పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నిర్మాణ సహకారాన్ని అందించినట్టు తన ట్వీట్లో పేర్కొన్నారు. అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ను కూడా దక్కించుకున్నాయని గుర్తు చేశారు.
అయితే, 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ సహకారం ఆగిపోయిందని, సింగపూర్ కన్సార్టియం కూడా అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలిగిందని టాన్సీ లెంగ్ తన పోస్టులో పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబుతో సమావేశమై ఏపీ అభివృద్ధిపై చర్చించినట్టు ఆయన వెల్లడించారు. సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సార్టియం పనిచేయకపోయినా, ఏపీలో పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో సాంకేతిక సహకారం అందించడంతో పాటు ప్రపంచ బ్యాంకు వంటి భాగస్వాములతో కలిసి ఏపీ అభివృద్ధి ప్రణాళికల్లో పనిచేస్తామని టాన్సీ లెంగ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రుల బృందం సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని సింగపూర్ మంత్రి తన ట్వీట్లో ఆకాంక్షించారు.
వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ చేసిన ప్రకటనకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ ప్రజల తరపున సింగపూర్ ప్రభుత్వానికి, ఆ దేశ మంత్రి టాన్సీ లెంగ్కు ఎక్స్ వేదికగా సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సుస్థిరాభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వం భాగస్వామిగా ముందుకు రావడం సంతోషదాయకమన్నారు.
వివిధ రంగాల్లో ఏపీ-సింగపూర్ కలిసి పనిచేయడానికి టాన్సీ లెంగ్తో జరిపిన చర్చలు మార్గం సుగమం చేశాయని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఉత్పాదక రంగం, పునరుత్పాదక శక్తి, పోర్టులు, డిజిటల్, ఇన్నోవేషన్, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేయడానికి ఈ చర్చలు దోహదపడతాయన్నారు. 90వ దశకం నుంచి సింగపూర్ ప్రభుత్వంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం చాలా విలువైందని సీఎం చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఏపీ అభివృద్ధి ప్రయాణంలో, ఆధునిక మౌలిక వసతుల కల్పనలో సింగపూర్ ప్రభుత్వం నుంచి సహకారం ఆశిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో అద్భుతమైన ప్రజా తీర్పుతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంకల్పం తీసుకున్నామన్నారు. స్వర్ణాంధ్ర-2047 సాధన దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. వివిధ రంగాల్లో సింగపూర్ దేశ విధానాలు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. పట్టణ, గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు సింగపూర్ తోడైతే ప్రజల ఆశలను నెరవేర్చగలమని సీఎం చంద్రబాబు తన ట్వీట్లో ఆకాంక్షించారు.
Read also:Both States : కృష్ణా నదికి భారీ వరద: జలాశయాలు నిండు కుండలు
